పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి)  (Author: గొడవర్తి శిరీష)

సీ.

ఆకులే పూవులై యలరించు వేళలో

ఆకుపచ్చదనమే యంతరించె - (ఈ పాదం లో ఆక్రోశం, మిగతా కవితంతా ఆనందం)

కుంకుమ స్నానాల కుసుమించి  కుజములు

పసుపు పూతలతోడ పల్లవించె

నారింజ రంగుల నాట్యాలు చేయుచు

సంపెంగ రంగుల సరసమాడె

ఎంతపుణ్యము సేయ యింత యందము కనే (కను)

భాగ్యంబు కలిగెనో, భావమెగసె.

తే. గీ

బొమ్మ కొమ్మయే చిత్రించె భూజములను

రాతిలో మొలచి తరులు రాణకెక్కె

పుడమి నవ్వులే పువ్వులై పూచెనవి యె

ఇంత వైచిత్రి యేరీతి ఇలయె పొందె.

సీ

అల్లరి గాలులే చల్లగా తాకంగ

అలజడులు శమించి ఆర్తి బాసె

అక్షులే త్రావగానందాల మధువును

మైకాన సోలె ను మానసంబు

మబ్బుపూలను  పూచె యబ్బురమగు మైత్రి

నేల చెరగు బట్టి నింగి లాగె

దివిజుల దీవియే దీప్తుల నెసగంగ

ముస్కోక యందాల మురిసె మనము

తే. గీ

అవని యంబరముల చెన్ను హాయి గొలిపె

మనసు మోదము నొందంగ మరులు గొలిపె

కవిని నే కాను యింపగు కవిత జెప్ప

చెన్ను చూడంగ మనమేమొ చిందులేసె.

0 comentaris