ఎరుక  (Author: కాలువ మల్లయ్య)

శ్రీ రాజరాజేశ్వర్‌ డిగ్రీ అండ్‌ పి. జి. కళాశాల కరీంనగర్‌ లోని తెలుగు ఉపన్యాసకుల స్టాఫ్‌రూమ్‌. తెలుగు ఉపన్యాసకులతో పాటు మరోనలుగురు ఇతర సబ్జెక్టుల ఉపన్యాసకులు ఆ గదిలో కూర్చొన్నారు. దసరా సెలవులకు రెండు రోజుల కాలదూరముంది. చాలా మంది విద్యార్థులు ముందే వెళ్ళిపోవడం వల్ల క్లాసులు నడవడం లేదు. ఉపన్యాసకులకు ఆటవిడుపన్నట్టుగా ఉంది.

         ‘‘ నమస్తే మిత్రులందరికీ. ’’ అంటూ ఆగదిలోకి ప్రవేశించాడు గంగయ్య. ఆయన కెమిస్ట్రీ లెక్చరర్‌. కథలవీ రాస్తుంటాడు. తెలుగు పంతుళ్లతోనే ఎక్కువ దోస్తానీ చేస్తాడు.

         ‘‘రావోయ్‌! గంగయ్యా! రా... రా! చేతిలో ఏదో పత్రిక ఉన్నట్టుంది. స్వాతి వీక్లీ కదా! కథ పడిరదా ఏంది? ’’

         అన్నాడు తెలుగు హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ లక్ష్మణశాస్త్రి. ‘‘అవును. స్వాతిలో నా కథొచ్చింది! ’’ అని టేబుల్‌ పై పత్రిక పడేసి కుర్చీలో కూర్చున్నాడు గంగయ్య.

         ‘‘గంగయ్య కథలు మస్తు రాస్తడు. ఎట్ల అబ్బిందో ఏమోగని బాగ రాయడం అబ్బింది.. ’’ అన్నడు నారాయణ సారు.

         ‘‘కెమిస్ట్రీ చదివిండు, మరి గీ సాహిత్యం ఎలా ఒంటబట్టిందో తెలువది... ’’ అన్నాడు వెంకట్రెడ్డి...

         ‘‘నాకు చిన్నప్పట్నుంచి సాహిత్యమంటే ఇష్టం. పాఠశాల దశ నుండే చాలా పుస్తకాలు చదివే వాన్ని... ’’

         ‘‘ ఇంతకీ ఈ పత్రికలో అచ్చయిన కథ దేనిపైన్నోయ్‌ గంగయ్య’’

         ‘‘ ఇంకే ముంటది? పేదరికమనో, సామాజిక అంతరాలనో ఏవేవో సొల్లు కబుర్లు రాస్తే కథయి పోతుంది... ’’

         లక్ష్మణ శాస్త్రి మాటలకు బాగా నొచ్చుకున్నాడు గంగయ్య.

         ‘‘అలాంటప్పుడు మీరు రాయొచ్చు కదా? ’’

         వామన్‌ రావు మాటలతో ఖంగు తిన్నాడు లక్ష్మణ శాస్త్రి.

         ‘‘ ఓ ఛందస్సు లేదు, ఓ నియమాలు లేవు. మనం మాట్లాడుకునేవి నాలుగు వాక్యాలు రాసి కథంటున్నారు. నేను ఛందోబద్ధమైన పద్యాలు చాలా రాసాను. అష్టావధానాల్లోనూ పాల్గొంటాను. కందం రాసిన వాడే కవి. దమ్ముంటే కందపద్యాలు రాసి చూపమను... ’’ అన్నాడు లక్ష్మణ శాస్త్రి.

         తన రాతలపై లక్ష్మణ శాస్త్రికి ఎప్పటికీ చిన్నచూపే. తానెంతగౌరవించినా తనను మాత్రం చులకనగానే చూస్తాడు. ఏదేమైనా సరే ఈ రోజు శాస్త్రిగారి అభిప్రాయాలు మారేలా చేయాలని నిర్ణయించుకున్నాడు గంగయ్య.. లేచి నిల్చున్నాడు. వాళ్ళెవరు ఆగమంటున్నా ఆగకుండా తన డిపార్ట్‌మెంట్‌ గదిలో కెళ్ళాడు. ఒక నోట్‌బుక్‌ పట్టుకొచ్చి శాస్త్రి చేతికిచ్చాడు.

         ‘‘ శాస్త్రి గారు! నేను రాసిన కందపద్యాల శతకం ఇది. రెండొందల పద్యాలు ఎలా ఉన్నాయో చూడండి. ’’ అని శాస్త్రిముందుంచాడు గంగయ్య.

         పద్యాలను పరిశీలిస్తున్న శాస్త్రిముఖంలో రంగులు మారుతున్నాయి. కథలే కాకుండా ఛందోబద్ధ పద్యాలూ రాయడంలో గంగయ్య నేర్పరి అన్న విషయం ఆతని కర్థమవుతుంది. కాని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు.

         ‘‘ చదివింది కెమిస్ట్రీ. గవేవో ఆటమ్స్‌, మాలిక్కూల్స్‌, ఎలక్ట్రాన్‌లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల గురించి చెప్పుకోక కథలు కాకరకాయలెందుకోయ్‌... ఇదువరకే చాలాసార్లు చెప్పాను. నా నృషి కురుతే కావ్యం అని? ’’

         శాస్త్రి మాటలకు కోపం తన్నుకొస్తున్నా నిభాయించుకుంటున్నాడు గంగయ్య. అక్కడున్న చాలామందికి ఆమాటలు నచ్చడం లేదు. అయినా ఆతనితో గొడవ పెట్టుకోవడం ఎవరికీ ఇష్టంలేదు. గంగయ్యకూ ఇష్టం లేదు. ‘‘శాస్త్రి గారూ! మీరే కాలంలో ఉన్నారు? సరే... మీకాలంలో కొచ్చే నేను మాట్లాడుతాను. భారతీయులు చాలా మంది పవిత్ర కావ్య్యంగా భావించే రామాయణాన్ని రాసింది వాల్మీకి ఒక బోయవాడన్న విషయం మీకు తెలియందా? మీరే తెలుగు పాఠం చెప్పేటప్పుడు చెబుతారు కదా! ఆయన మీరునుకున్నట్టు రుషి అంశ ఉన్న ద్విజుడు కాదుకదా! అష్టాదశ పురాణాలు రాసిన వ్యాసుడు కూడా ఒక బెస్త కన్యకు పుట్టిన వాడే కదా! మహాభారతం లోని అంతర్భాగమైన భగవద్గీతను అర్జునుడికి బోధించిన శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందిన వాడే కదా! వేలేండ్ల క్రితమే ఈ శూద్రులు రాసిన మహాకావ్యాలు భారతీయ సాహిత్యంలో అగ్రభాగాన నిలిచాయి. అలాగే రఘవంశం, మేఘసందేశం రాసిన కాళిదాసు శూద్రుడే కదా! ఇవి నేను కల్పించినవి కావు. మీరు చెప్పేకతలే. అప్పుడే శూద్రులు రాయగలిగినపుడు, అవి మహాకావ్యాలైనపుడు ప్రజాస్వామికయుగంలో కూడా మీకిలాంటి భావాలుండటం సరైంది కాదేమో ఆలోచించండి.. ’’

         గంగయ్య మాటలకు ఖంగుతిన్నాడు శాస్త్రి... తన చేతివేలితో తనకన్నే పొడవడానికి సిద్ధంగా ఉన్న గంగయ్య ముందు ఓడిపోదలుచుకోలేదు.

         ‘‘వ్యాస వాల్మీకులు తమకర్మలతో, తపశ్శక్తితో బ్రహ్మజ్ఞాన సంపన్నులయ్యారు కాబట్టే ఆ కావ్యాలు రాయగలిగారు. కాళిదాసుపై దేవీ కటాక్షముంది కాబట్టే గొల్లడయినా కావ్యోత్పత్తి చేయగలిగాడు. శ్రీకృష్ణుడు యాదవ వంశంలో పుట్టిన విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం. అలాంటి మహనీయులకు కులం అంటగడుతావా? దైవ ధూషణ మహాపాతకం. కథలంటూ, నవలలంటూ మీరు రాసేవన్నీ నాస్తిక రచనలు. పైగా ఏవేవో పోలికలు’’ కొంత ఆగ్రహంగానే అన్నాడు శాస్త్రి.

         ‘ శాస్త్రిగారూ! మీరెందుకావేశపడుతారు? నేను దైవధూషణ, రుషిధూషణ ఏదీ చేయలేదు. చేయను కూడా. భౌతిక వాస్తవికతను చెబుతున్నాను. నా కథలకు ప్రాణం, ప్రణవం, మూలం అన్నీ భౌతికత, మనిషితనం, వాస్తవికత, మీకేమైన బాధ కలిగిస్తే క్షమించండి. ఇంతటితో ఈ వాదాన్ని ఆపేద్దాం. ’’

         అన్నాడు గంగయ్య.

         కాని గంగయ్యను వదిలిపెట్టదలుచుకోలేదు శాస్త్రి. వయసులోనూ, సామాజికస్థితిలోనూ తనకంటె చాలా చిన్నవాడైన గంగయ్య ముందు ఓడిపోదలుచుకోలేదు శాస్త్రి. తర్కశాస్త్రాన్ని ఆపోసన పట్టిన తనలాంటి వాడిముందు గంగయ్య వాదనలు హనుమంతుడిముందు కుప్పిగంతుల్లాంటివే ననుకున్నాడు శాస్త్రి.

         అవే మాటలు గంగయ్యనని ఆతన్ని ఇబ్బందిలో పెడ్తున్నానని భావించాడు.

         శాస్త్రి రెచ్చగొడుతుంటే తాను మౌనంగా ఉండటం సరైంది కాదనుకున్నాడు. ‘‘ శాస్త్రిగారూ తర్కంతో ఏ విషయాలూ తేలవన్న విషయం మీకు తెలియంది కాదు. పాండిత్య ప్రకర్షను ప్రకటించుకోవడం తప్ప తర్కం వల్ల తేలేదంటూ ఏం లేదు. కాలుకు బెడితే మెడకు, మెడకు బెడితే కాలుకు’ పెట్టే వాదనలే తర్కం.. ’’

         ‘‘ చేతగాని వాళ్ళంతా తర్కం వట్టిందటారు. ఇపుడు న్యాయస్థానాల్లో జరుగుతున్నది తర్కం, వాదనా పటిమనే కదా! తీర్పులూ దాన్ని బట్టే ఇస్తున్నారు కదా! మోటోనికేమెరుక మొగిలిపూవు వాసనన్నట్టు నీకేం తెలుసు తర్క శాస్త్రం, పాండిత్యం గురించి. ’’ అన్నాడు శాస్త్రి.

         ‘‘ శాస్త్రిగారూ! గంగయ్య కథ రాసిన్నని మీరు పెద్దలని చూపించడానికి వచ్చినందుకు ఈ వాదాలన్ని ఎందుకండి. మీకు నచ్చితే సరే అనొచ్చు, లేకుంటే కాదనొచ్చు కాని ఇంత పొడుగు వాదమెందుకు? ’’

         ‘వెంకట్రెడ్డే! కృష్ణుడు యాదవుడని, కాళిదాసు గొల్లోడని ఏవేవో వెర్రి వాదనలతో గంగయ్య లాంటోల్లు తమ కొచ్చిన నాలుగు అక్షరంముక్కలను గొప్పవని విర్రవీగుతుంటారు. పురాణాలు, రామాయణాలు, భారతాలు వేదవేదాంగాల గురించి వీళ్ళకేం తెలుసు? రసాయన శాస్త్ర ప్రయోగాలు చేసి అవే గొప్పని భావిస్తారు వీళ్ళు. వీళ్ళెరుక పిచ్చెరుక, ఎడ్డెరుక, అసలు ఎరుకే కాదు’’ భగవంతుడిని తెలుసుకోవడమే అసలైన ఎరుక’’ అంటూ హేళనగా నవ్వాడు శాస్త్రి.

         ఆ మాటలు గంగయ్య హృదయానికి సూదుల్లా తగిలాయి.

         ‘శాస్త్రిగారూ! నేను చదువును అక్షరమని భావిస్తాను. సైన్సును నూటికి నూరు పాల్లు నమ్ముతాను. అట్లని ఎవరి విశ్వాసాలను తప్పనో, ఒప్పనో వాదించడం నాకిష్టం లేదు. కుల వ్యవస్థతో దేశంలో ఏం జరిగిందో మీకు తెలియంది కాదు. ఈ వ్యవస్థ కొందరిని చదువులకు దూరంగా ఉంచడం వల్ల ఎంతో మంది ప్రతిభ దేశానికి ఉపయోగపడలేదు. సరే ఇప్పుడా వాదనలన్నీ అనవసరంకాని మీరన్న మా ఎరుక, ఎంత శాస్త్రీయమైందో చెప్పమంటారా? ’’

         ఆ మాటలకు హేళనగా నవ్విండు శాస్త్రి.

         ‘‘గొల్లెరుక ఎడ్డెరుకంటె తెలిసినెరుకంటుండు గంగయ్య’’ అని ఇంకా నవ్వసాగిండు. నవ్వినవ్వి

         ‘‘దీన్నే తిక్కంటరు. వేపకాయంత వెర్రుంటదట గదా! అన్నాడు.

         ఇంకా మౌనంగా ఉండదలుచుకోలేదు గంగయ్య ఊళ్ళో తమవాళ్ళను, గొర్ల కాపర్లను తక్కువ చేసి మాట్లాడటం చూడడమేకాదు ప్రత్యేక్షంగా అనుభవించాడు గంగయ్య. చదువుకొని సమాజంలో ఓస్థితిలో ఉన్న తనే ఇలా అవమానాలకు గురవుతుంటే తన పూర్వీకులెన్ని అవమానాలకు గురయ్యారో నన్న ఆలోచన గంగయ్యను బాధిస్తుంది.

         గంగయ్య కళ్ళముందెన్నో దృశ్యాలు.

          * * *

         ఊరి రచ్చబండ ప్రదేశం. అక్కడో పంచాయతీ జరుగుతుంది, కచ్చీరు మీద పంచాయతీ పెద్దలు కూర్చొనున్నారు. వారికెదురుగా ఇరుపక్షాల వారు చెట్లకానుకొని, గోడల కానుకొని కూర్చున్నారు. కొందరు నేలపై కూర్చొనున్నారు.

         ‘‘ చెప్పరా సారయ్య ఈ పంచాయతెందుకో చెప్పు. ఆడిగాడో పెద్దమనిషి. సారయ్యే మాట్లాడకుండా తలవంచుకున్నాడు.

         ‘‘ వాడు మొగోడయ్యుండి ఆడపిల్లోలె సిగ్గుపడుతున్నడు. నువ్వయినా చెప్పే పిల్ల’’ రంగమ్మ.. కూడా చెప్పడానికి సిగ్గుపడుతుంది.

         ‘‘ గా పోరగాండ్ల నడుగుతె ఏం చెప్పుతరు పటేల. పడుసు పెడుసని ఇద్దరు పడుసుపోరగాండ్లే. లగ్గమయి ఆరునెల్లే అయింది. ఏం పాడయిందో ఏమో విడాకులు కావాలంటున్నారు’’

         ‘‘ లగ్గమై ఆర్నెల్లుగూడ కాలేదు. ఒగల నిడువకుంట ఒకలుండాలె గని గిదేం పంచాయితి. గిప్పుడే విడాకులేంది? గంత కట్ట మేమొచ్చిందట. ’’

         ‘‘ గంత కాని పనేం జేసిందిపోరి. ’’

         ‘‘పోరడేమన్న పక్క సూపులు జూత్తున్నాడె? ’’

         ‘‘ గదేం లేదు పటేల ఒగలంటె ఒగలకు ప్రేమలు లావు. ’’

         ‘ మరిగ పంచాయితేందే? ’’

         కిసుక్కున నవ్విండు కుందనర్సయ్య.

          ‘‘ రాత్తిరి పోరి పోరడు జెప్పినట్టు వింటలేదట... ’’ అన్నాడు.

         ‘‘ వీడు శ్రీకృష్ణలీలలు చేస్తనంటె గా పోరింటదా? ’’

         ‘‘ గీ పోరడేమొ భీమండి బొంబై తిరిగచ్చిండు. పోరికెమొ ఊరుదప్పితే ఏం దెలువది. ’’

         ‘ పెండ్లాం మొగల నడుమ రాత్రి జరిగేటియెవ్వలకు తెలుత్తది’

         ఎంత సేపయినా పంచాయితీ తెగె సూచనలు కనవడుతలేవు.

         ఇంతలో గొల్లభూమక్క అక్కడి కొచ్చింది. కొంచెంసేపు విన్నది. ఆమె బతుకమ్మ పాటలు పాడుతది. ఆడొల్లనడుమ పంచాయితీలు తెంపుతది. ముక్కు సూటి మనిషి.

         ‘‘ పెద్దమనుషులట పంచాయితులు జేత్తరట. గిండ్లేముందని పంచాయతిపెట్టిండ్రు. పోరీ ఇట్రాయె ’ అని రంగమ్మను పిలిచింది.

         ‘‘ సారిగాడు బీమండి బొంబై అన్ని తిరిగచ్చిండు. సినిమాలు సూసిండు గవ్వి సూసి ఏదో కావాలని అడిగిండేమొ. గదాంట్ల తప్పేముందే. రాత్రి సంగతులు బైట వెట్టుకుంటారె. మొగ బుద్ది మోటు బుద్ధి. సదురుక పోవాలె గని నలుగుట్ల పడుతవా. సప్పుడు జేక సంసారంజెయ్యి. ఆని జుట్టు నేతుల వట్టుకోవాలెగని విడాకులిచ్చిపోతావె. పో... పో.. ’’ అని తిట్టింది.

         సారయ్యను దగ్గరికి రమ్మంది.

         ‘‘ అరే సారిగా, పడుసు పెడుసన్నట్టు జేత్తెట్లరా? గా పట్నం ఆడోల్లతీరుగ సినిమాలోలె గీ పోర్ని సెయిమంటె సేత్తదా? మెల్లెమెల్లెగ బుదురకిచ్చి రేవుకు దెచ్చుకోవాలె. పంచాయతట పంచాయతు. ఆడిబుద్ధి అట్కరి బుద్ధి సర్దిచెప్పి నీకనుకూలంగ జేసుకోవాలె దాన్ని సరిపెట్టుకొని పో.. గుట్టుగా సంసారం జేసుకోండ్రి.. ’’ అని గద్దరించింది.

         ఇద్దరు చేతిల చెయ్యి కలుపుకొని నవ్వుకుంట తుళ్ళుకుంట వెళ్ళిపోతున్నారు.

          * * *

         ఇద్దరు తర్క శాస్త్రం పండితులు మస్తు వాదించుకుంటున్నారు, కొంచం దూరంగ ఓ జంతువుపడు కొనుంది.

         ‘‘ అదుగో ఆ జంతువుకు మూడేకాళ్ళు’’ అన్నాడు ఒకాయన

         ‘‘ కాదు కాదు రెండే కనబడుతున్నాయి నాకు’’

         రెండని ఒకరు, మూడని ఒకరు వాదించుకుంటూనే ఉన్నారు.

         అక్కడికి ఓ గొర్లకాపరి వచ్చాడు.

         ‘‘ ఏంది అయ్యగార్లు ఏమో వాదించుకుంటున్నారు...? ’’

         చెప్పారు వాళ్ళు.

         ‘‘ సానసేపట్నుంచి సూత్తన్న గిదీనికి గింత సేపు వాదించు కుంటరా సారు?

         నాలుగడుగులు దగ్గరికి పోయిసూత్తె తెలుత్తదిగద’’ అన్నడు.

         ‘‘ లేదు లేదు ` మేం తర్కశాస్త్ర పండితులం. తర్కంతోనే తేలాలె నీకేం తెలుసు గొర్లు కాసేటోనివి’’ అన్నారు వాళ్ళు.

         ‘ నీ తర్కం పాడుగాను, అది జంతువే కద! జంతువుకు నాలుగు కాల్లుంటయని తెలువదా? చో అని తన చేతిలోని కట్టె విసిరాడా జంతువుపైకి అది కుందేలు పిల్ల. లేచి పరుగెత్తుతుంది.

         ‘‘ ఆగొ జూడుండ్రి... ఎన్ని కాల్లున్నయో ’’ అన్నాడా గొర్ల కాపరి ఆ పంతుల్లు ముఖాలు మాడ్చుకున్నారు.

          * * *

         ‘‘శాస్త్రిగారూ! నేనీ రెండు పిట్టకథలెందుకు చెప్పానంటే గొల్లెరుకంటె ఎట్లుంటదో తెలువన్నని. నేనెవరి జ్ఞానాన్ని తక్కువ చేయడం లేదు. కాని గొర్ల కాపర్లు చెట్టనక, పుట్టనక, గుట్టనక, రాత్రనక, పగలనక గొర్లు మేకల వెంట తిరిగేవారు. ఈ సంచార జ్ఞానం వారికెంతో జ్ఞాన సంపదనిస్తుంది. పశువైద్యం చేస్తారు. కొనుపులతో పశువులను కాల్చి రోగాలు తగ్గిస్తారు. గాయాలైతే కంకబద్దలతో కట్టుగట్టి బొక్కలనతికిస్తారు. గొల్లవారికి తెలియని అడవి మొక్కలేదు. ఆధునిక వైద్యం రాకముందు అనేక రోగాలకు చెట్ల పసర్లతో వైద్యం చేసింది గొల్లలే. ఇదీ శాస్త్రిగారూ గొల్లెరుక’’ అన్నాడు గంగయ్య.

         ‘‘కథలు రాయడం అలవాటు చేసుకున్నావు కదా, పిట్టకథలు కూడా చెబుతున్నావా గంగయ్యా? నువ్వూ జగ్గూపుతూ, కనకడప్పుకొడుతూ, ఒగ్గుకథలు చెబుతూ తిరగాల్సింది. ఎందుకు చదువుకున్నావు? ’’

         రాజ్యాంగంలో అంబేద్కర్‌ ఇచ్చిన విద్యాహక్కు పుణ్యంవల్ల చదువుకున్నాను. అవును మా నాన్న నోటి కథ వారసత్వమే, జానపద బాణీలు, భాషే నన్ను రచయితను చేసాయి’’ అన్నాడు గంగయ్య.

         తానెన్ని విధాలుగా కించపరిచినా తన వాదాన్ని పూర్వపక్షం చేస్తున్న గంగయ్య నెలా జయించాలో శాస్త్రికర్థం కావడంలేదు.

         ‘‘సర్లే... నీ వెర్రినీది. ఎంత చదువుకున్నా నీకూ వేపకాయంత వెర్రుంది కదా! ’’

         ‘‘మాకున్నది వెర్రికాదు శాస్త్రిగారూ! వేపకాయంత నిజం. మీకీ విషయం తెలుసా? ఇది నేను చెప్పింది కాదు. మహాతత్వవేత్త చెప్పింది. గొర్లకాపరి కాలేనివాడు గొప్ప తాత్వికుడు కాలేడని? ’’

         ఆ మాటలు మరింత సూటిగా తగిలాయి శాస్త్రికి.

         ‘‘తత్వవేత్త కావడానికి గొర్లు కాయాలా? ఇదేం వెర్రి. నీకు వెర్రిబాగా ముదిరింది గంగయ్యా! సైకాలిజికల్‌ డాక్టర్‌ కిషన్‌ గారి దగ్గరికి వెళ్ళిరా! ’’ అన్నాడు పకపకా నవ్వుతూ.

         ఆ గదిలో ఉపన్యాసకులంతా వారి మాటలను ఆసక్తిగా వింటున్నారు. శాస్త్రి చేసిన అవహేళనకు గంగయ్య జవాబుకోసం ఎదిరుచూస్తున్నారు. సైన్సు చదివిన వాడుగానే కాక సైన్సును నూటికినూరుపాల్లు నమ్మే శాస్త్రీయ ఆలోచనాపరుడు గంగయ్య యథార్థవాది అని వాళ్ళకు తెలుసు.

         ‘‘శాస్త్రిగారూ! వేదవేదాంగాలు పురాణాలు చదివిన మీకు ఈ విషయాలు తెలియనివి కావు. ప్రపంచంలోనే మొట్టమొదటి మనిషి తాత్వికుడు బుద్ధుడు తపస్సుతో సొమ్మసిల్లి పడిపోయి మరణావస్థలో ఉన్నప్పుడు సుజాత అనే గొల్ల అమ్మాయి పోసిన పాలు తాగి బతికాడు. తర్వాత జ్ఞానోదయం అయింది. ఏసుక్రీస్తు గొర్రెల పాకలో పుట్టాడు. చేతిలో ఎప్పటికీ గొర్రెపిల్ల ఉంటుంది. మోజెస్‌ గొర్రెల కాపరిగా ఉన్నాడు. మహమ్మద్‌ ప్రవక్తకు గొర్రెలతో సంబంధముంది. గీతాకారుడు శ్రీకృష్ణుడు యాదవవంశంలో పుట్టిపెరిగాడు. పశువులు గొర్రెలతో సహజీవనం చేసాడు. వీళ్ళంతా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప తాత్వికులు. శ్రీకృష్ణుడు ఆది యోధుడు. ఓ ఐకాన్‌. అతన్ని గోపికలతో తిరిగినట్టు రాయడం తప్పు. శ్రీకృష్ణలీలలంటూ తక్కువ చేయడం మీ దృష్టిలోనూ దోషమే అనుకుంటాను... ’’

         ‘‘అంటే ఆ స్థాయి తాత్వికుడివా నువ్వు. నువ్వు చెప్పే విషయాలు నక్కకూ నాగలోకానికి పోలిక చెప్పినట్లున్నాయి. అంటే నువ్వు కూడా తత్వవేత్తనంటావు. చిన్నప్పుడు గొర్లు మేకలతో తిరిగానని నువ్వే చెప్పావు కదా! ’’ అన్నాడు శాస్త్రి.

         ‘‘నేను తత్వవేత్తననో, తత్వవేత్త నవుతాననో చెప్పడంలేదు. కాని నాకు నా జీవితం, నా తల్లిదండ్రుల అనుభవాలు, కుటుంబనేపథ్యం, అనుభవించిన వివక్ష లాంటి వన్నీ రచయితనవడానికి సహకరించాయి. మా ఇంటిముందు చెప్పిన జానపదకథలు, గ్రామంలో చూసిన అనేక కళారూపాలు, తెలంగాణ సంస్కృతి, భాష, సంఘర్షణ అన్నీ నన్ను రచయితను చేసాయే తప్ప కేవలం నా పుటక కాదు. పుటుకతో ఎవరికీ ఏం రావు. పరిసరాలతోనే అన్నీ సమకూరుతాయి.... నా గొర్లకాపర్ల జీవితం నన్ను రచయితను చేసింది. మీరభిమానించే, రోజూ పూజించే శ్రీకృష్ణుడి కృష్ణతత్వాన్ని మీరర్థం చేసుకొనుంటే మీరిలా మాట్లాడరు. ’’

         గంగయ్య మాటలు సూటిగా శాస్త్రి హృదయానికి తగిలాయి. నిత్యం భగవద్గీతను పారాయణం చేసే తనకు కృష్ణుడు అర్థం కాలేదా? భారతీయ సాహిత్యంలో తలమానికమైనదిగా భావింపబడే గీత తన నర్థం చేసుకోలేదా? భగవద్గీతాకారుడి కృష్ణతత్వం అంటే గంగయ్య దృష్టిలో ఏంటి? ఈ ప్రశ్న గంగయ్యను అడిగి తక్కువ కావడం తనకిష్టం లేదు, అందుకే వ్యంగ్యంగా...

         ‘మాకర్థం కాని నీకర్థమైన కృష్ణతత్వమేంటోమరి? శూద్రమేధావివి కదా అదేంటో సెలవిస్తావా? ’’ అన్నాడు శాస్త్రి.

         ‘‘చెబుతాను శాస్త్రిగారూ! నేనర్థం చేసుకున్న కృష్ణతత్వం, తాత్వికతేంటో చెబుతాను. దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోవడమో, అన్యదా భావించడమో చేయకండి... ’’

         ‘‘గంగయ్యా! ఇందులో అపార్థం చేసుకుంటానికేముంది. ఎవరి అభిప్రాయాలు వారివి. ఏ విషయంపైననైనా అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది’’ అన్నాడు వెంకట్‌రెడ్డి.

         ‘‘శాస్త్రిగారేం మాట్లాడటం లేదు. మౌనం అర్ధాంగీకారం మాత్రమే. నాకు పూర్తి అంగీకారం కావాలి. ’’

         ‘‘సరే చెప్పు’’ అన్నాడు శాస్త్రి.

         ‘‘శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అష్టమ అవతారమనో, దశావతారాల్లో కృష్ణావతారమే సంపూర్ణావతారమనో చర్చ మన కనవసరం. దాని జోలికి పోవడం లేదు. మన చర్చను వివాదాస్పదం చేయడం నాకిష్టం లేదు. ఎవరి నమ్మకాలు వారివి. ’’

         ‘‘కృష్ణుడు అవతారపురుషుడని కాకుండా నువ్వు చెప్పే దేంటి? సైన్సు పేరుమీద నీలో నాస్తిక భావాలున్నాయి... ’’

         ‘‘శాస్త్రీ నువ్వాగు. గంగయ్య చెప్పే విషయాలు మనం ఇదువరకు వినని, చూడని కృష్ణున్ని సాక్షాత్కరింపజేస్తాయి. చెప్పనీయ్‌... ’’ అన్నాడు నారాయణసారు.

         ‘‘శ్రీకృష్ణపాత్ర నిజమే అయితే అతడొక ఆదియోధుడు. ద్రవిడయోధుడు. యదువంశదీపకుడు. శ్రమజీవుల పక్షపాతి. అమాయకులైన గొల్లలను మాత్రమే కాదు, శ్రామిక కులాలపక్షం వహించే గొప్పవీరుడు. చిటికెనవేలితో గోవర్థనగిరిని ఎత్తాడనడం ఓ అతిశయోక్తి కావచ్చు కాని వర్షం బారినుండి ప్రకృతి విపత్తుల నుండి గోపాలురను, గోవులను కాపాడటానికి నీడ కల్పించిన శ్రామికపక్షపాతి. ఇంద్రుడు లాంటి రాజులను ఎదిరించి ప్రజలకు అండదండగా నిలిచిన గోపాలుడు’’

         గంగయ్య మాటలు ఆలోచనాత్మకంగా, తాత్వికంగా కనబడినా చర్చచేసి ఆతనికి మరింత బలం ఇవ్వడానికి సిద్దంగా లేడు శాస్త్రి. అందుకే మౌనంగా ఉన్నాడు.

         ‘‘గంగయ్యా! శ్రీకృష్ణుడు యాదవుడే అయితే గీతలో గొల్లలను శూద్రుల్లో ఎందుకు కలుపుతాడు? స్వధర్మం చేయాలని తన వాళ్ళను గొర్రెల, పశువుల కాపర్లుగానే ఎందుకుంచుతాడు? ’’ అన్నాడు వైకుంఠం సారు.

         ‘‘కుంతిదేవి శ్రీకృష్ణుడికి మేనత్తకావడం, కృష్ణుడి చెల్లెలు సుభద్రను అర్జునునికివ్వడం, యశోద నందరాజుల పెంపకం, పాండవులతో బంధుత్వం, నందరాజు యశోదల దగ్గర పెరగడం, భారతంలో అనేక చోట్ల గొల్లడుగా యాదవుడిగా పిలువబడటం లాంటివన్నీ కృష్ణుడు యాదవుడనే చెబుతున్నాయి.

         కృష్ణుడు చెప్పిన గీతా శ్లోకాల్లో ఎక్కడా వేదాల్లోలా ఫలానావారు ఇలా పుట్టారని లేదు. గుణకర్మలను బట్టి వర్ణాలన్నాడు. ఈ శ్లోకం కూడా ప్రక్షిప్తమై ఉంటుంది. కృష్ణుడు చెప్పిన స్వధర్మం కూడా కులధర్మం కాదని నా అభిప్రాయం. ఎవరిపనులు వారు చేసుకోవాలని అయ్యుంటుంది. గీతలోని వర్ణధర్మశ్లోకం వేద వర్ణధర్మ శ్లోకానికి పొడగింపే తప్ప అది కృష్ణుడు సృష్టించింది కాదు. ’’

         ‘‘భగవంతుడైన కృష్ణుడు చెప్పిన శ్లోకాన్నే నువ్వు కాదంటున్నావు. దైవ ధూషణ చేస్తున్నావు గంగయ్యా! ఇది సరైందికాదు... ’’

         ‘‘శాస్త్రిగారూ! నన్నర్థం చేసుకోండి. నేనే దూషణా చేయడం లేదు. నేనర్థం చేసుకున్న కృష్ణున్ని ఆవిష్కరిస్తున్నాను... ’

         ‘‘సరే చెప్పు గంగయ్యా? ’’ అన్నాడు వెంకట్రెడ్డి.

         ‘‘శ్రీకృష్ణుడు ఒక సంపూర్ణమైన మనిషి. ద్వారకలాంటి వినూత్న మహా నగరాన్ని నిర్మించిన గొప్ప ఆర్కిటెక్టు. యాదవ మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు. బహుజనకులాల పట్ల సానుభూతితో పాటు రాజ్యాధికార భావన ఉన్న గొప్ప రాజు. జాంబవతి లాంటి దళిత అమ్మాయిని పెళ్ళిచేసుకొని ఆ కాలంలోనే కులవివక్షను బద్ధలు కొట్టిన సంస్కరణవాది. నేటి అమలిన శృంగారానికి రాధాకృష్ణుల ప్రేమ చక్కని ఉదాహరణ. యుద్ధతంత్రం ఎరిగిన గొప్ప యుద్ధవీరుడు. చాణక్యుడుని మించిన యుద్ధ నీతినెరిగిన మహావీరుడు. యాదవుడని అతన్ని రథసారథిగా మాత్రమే చేసినా కృష్ణుడు లేకుండా మహాభారత యుద్ధం లేదు అనేది వాస్తవం.

         పాండవపక్షపాతిగా ధర్మపక్షపాతిగా, ఎవరి భూమి వారికి రావాలన్న న్యాయపక్షపాతిగా పాండవులను గెలిపించిన ధర్మపక్షపాతి. దుర్యోధన, దుశ్శాసనుల మానభంగచర్యలను అడ్డుకొని స్త్రీలపక్షాన నిలిచిన స్త్రీ పక్షపాతి. మాతృస్వామ్యవ్యవస్థను సమర్థించినవాడు. యాదవులు శ్రీకృష్ణుడు ఉండి ఐక్యంగా ఉన్నంతవరకు మహారాజులుగానే ఉన్నారు. కృష్ణుడి అనంతరం ముసలం పేరుమీద యాదవరాజ్యాలు అంతరించాయి. చారిత్రక కాలంలో దేవగిరిలాంటి యాదవ రాజ్యాలు వెలిసినా శ్రీకృష్ణుడిలాంటి ఐకాన్‌ నాయకుడు పుట్టలేదుకాబట్టే యాదవులు చెట్టుకొకరు పుట్టకొకరన్నట్టుగా నోమడిక్‌ తెగలుగా మారిపోయారు’’ అన్నాడు గంగయ్య.

         గంగయ్య విశ్లేషణకు శాస్త్రిగారికీ దిమ్మ తిరిగినట్టయింది. తన ఆధిక్యతాభావం, ఒకేవైపు ఆలోచనా విధానం సరైందేనా అన్న అనుమానమూ వచ్చింది. గంగయ్యపై ఉన్న వ్యతిరేక భావం తగ్గింది.

         ‘‘చాలా బాగా చెప్పావు గంగయ్యా! నీకింత ఎరుక, తాత్వికత?? ’’ అని ఆగాడు శాస్త్రి.

         ‘‘శాస్త్రిగారూ! ఓ సందర్భంలో, ప్రత్యేక పరిస్థితుల్లో వర్ణవ్యవస్థ లాంటివి కొన్ని వచ్చి ఉండవచ్చు. కాని వేలేండ్లు గడిచినా వాటినే పట్టుకొని వేలాడటమెందుకు? పుట్టుకతో కాదు, గుణకర్మలను బట్టి వర్ణాలు ఏర్పడ్డాయన్నాడు కృష్ణుడు. ఆ కాలంలోనే బ్రహ్మజ్ఞానం అంటే జ్ఞానసంపన్నత తెలిసిన వాల్మీక, వ్యాసాదులు బ్రాహ్మణులయ్యారు. రాజ్యాల నేలిన శూద్రులు క్షత్రియులయ్యారు. స్వాతంత్య్రానంతరం కులాలకతీతంగా చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు కొనసాగుతున్నాయి. మరింకా వర్ణకుల వ్యవస్థను సజీవంగా ఉంచడమెందుకు? శ్రీకృష్ణుడు చెప్పిన గుణ అంటే మంచి చెడ్డ మరియు జ్ఞానసంపద పనులు. వృత్తిపనులు. ఈ కర్మలు, వృత్తులు ప్రపంచమంతటా ఉన్నాయి. కాని కులాల్లేవు. మంచి, చెడు జ్ఞానం అనేవి మానవజాతి అంతటా ఉన్నాయి. కాని వర్ణాలు, కులాలెక్కడా లేవు. ఇప్పుడైనా మనం కులనిర్మూలన దిక్కు పయనిస్తే మంచిది కదా...! ’’

         గంగయ్య మాటలతో దీర్ఘాలోచనలో పడ్డాడు శాస్త్రి. కొద్దిసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.

         ‘‘గంగయ్యా! నీకున్న ఎరుకతో నా కళ్ళు తెరిపించావు. నువ్వు చెప్పిన కృష్ణతత్వం నాలోని అహంకారాన్ని తుత్తునియలు చేసింది. అవును ఎవరికీ పుట్టుకతోనే ఆధిక్యతాభావం కాని, న్యూనతాభావం కాని అంటకట్టకూడదు. కులాలవల్ల ఏర్పడిన సామాజిక అంతరాలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. పూర్తిగా తొలగిపోవాలి. అందరూ విద్యతో జ్ఞానవంతులయితే, నీలాంటి ఎరుకకలిగినవారయితె కుల నిర్మూలన జరిగి తీరుతుంది. చదువంటే కేవలం అక్షరాస్యత కాదు, జ్ఞాన, విజ్ఞాన సంపద పెరగడం అన్న విషయాన్ని గుర్తిస్తే కులరహితభారతం ఏర్పడుతుంది... ’’

         అన్నాడు లక్ష్మణశాస్త్రి. ఆయన కళ్లవెంట పటపటా నీళ్ళు కారుతున్నాయి.

         ‘‘శాస్త్రిగారూ! మిమ్మల్ని నేనేమయినా నొప్పిస్తే క్షమించండి... ’’

         ‘‘లేదు గంగయ్యా! నీ మాటలతో నా ఆలోచనను విశాలం చేసావు. నేనే నీకు కృతజ్ఞుడినై ఉండాలి’’

         గంగయ్యలో లక్ష్మణ శాస్త్రికి శంకరాచార్యులతో వాదించిన ఆచార్య ఛండాలుడు దర్శనమిస్తున్నాడు..

         ...................

0 Comments

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)