వైద్యో నారాయణో హరి  (Author: జడా సుబ్బారావు)

రవీంద్ర చేతిలోని ‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ పుస్తకంలోని పుటలు గాలికి రెపరెపలాడాయి. ఆ పుస్తకం కవర్ పేజీమీద ఫొటో చూస్తుంటే రవీంద్ర మనసు సముద్రమయింది. రోగిని నులక మంచం మీద పడుకోబెట్టి నలుగురు మనషులు మోసుకుపోయే దృశ్యం పదేపదే అతని మనసును మెలిపెట్టసాగింది. పట్టణాలకు దూరంగా కొండల్లో గుట్టల్లో కాపురం ఉంటూ అనుకోని ఆపద వచ్చినప్పుడు ముప్పై నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆసుపత్రికి చేరుకునే వాళ్లను తల్చుకున్న కొద్దీ అతని హృదయంలో బాధ సుడులు తిరగసాగింది.

“నీ నిర్ణయం అదేనా?” కోపమో, బాధో తెలియని అసహనం బాపూరావు కోళే గొంతులో కొట్టుమిట్టాడింది. తండ్రి వంక చూశాడు రవీంద్ర.“నాన్నా! డాక్టరు పట్టా పుచ్చుకుని నేను, నాలాంటి వాళ్లెందరో ఎల్లలు దాటి వెళ్ళిపోతే దేశం మంచాన పడుతుంది. గొప్పవాళ్లను బతికించడానికి ఈ దేశమెప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అంకితభావం ఉన్న డాక్టర్లు తప్ప ఈ దేశపు పేదల అనారోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తారు? మెళ్ళో స్టెతస్కోపు, ఒంటిపై తెల్లకోటు, పెదాలపై చిర్నవ్వు, చేతి స్పర్శ.. ఇవన్నీ మమ్మల్ని డాక్టరుగా గుర్తించడానికి మాత్రమే కాదు, పేషెంటుని బతికించడానికి కూడా! అందుకే వైద్యసహాయం లేని మారుమూల పల్లెల్లోని పేదలకు సేవ చేయడానికి వెళ్తాను” తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పి సోఫాలో కూర్చున్నాడు రవీంద్ర.

కొడుకు మాటలు విన్న తండ్రి నిశ్చేష్టుడయ్యాడు. తల్లికి నోటి మాట కరువైంది. “నువ్వొచ్చిన ఆనందం ఆవిరవడానికి నిముషం పట్టలేదు. నీ చేతిలో డాక్టర్ పట్టా చూస్తుంటే నా కళ్లవెంట ఆనందబాష్పాలు రాలట్లేదు. ఎవడైనా ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ పైకి వెళ్లాలని కలలు కంటాడు. నువ్వు మాత్రం అన్ని మెట్లూ దిగొచ్చి నేల వైపు చూస్తున్నావు. వేదికెక్కిన ప్రతీవాడు వేదాంతి అవుతాడా? మైకు ముందు నుంచున్న ప్రతీవాడు మహానుభావుడు అవుతాడా? ఆదర్శం అందలాలెక్కాలని చూస్తే ఆచరణ అధఃపాతాళానికి తొక్కేస్తుంది” బాపూరావు కోళే ముక్కుపుటాలు కోపంతో అదురుతున్నాయి.

చెట్టంత ఎదిగిన కొడుకు ముందు తన అహాన్ని వదిలేసి ఏడవాలో లేదో తేల్చుకోలేక నీళ్లు నిండిన కళ్ళు నీళ్ళు నమలసాగాయి. కాసేపయ్యాక, “చూడరా! సిద్ధాంతాలు చెట్టెక్కించవు, రాద్ధాంతాలు గట్టుమీద నుంచోబెట్టవు. అప్పటికప్పుడు అతితెలివి ప్రదర్శించి నెగ్గుకొచ్చే తెలివితేటలున్న వాడు పైకొస్తాడు. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అనేదే ఎప్పటికైనా శ్రీరామరక్ష” అన్నాడు గొంతు తగ్గించి బాపూరావు కోళే.

తండ్రివైపు చూశాడు రవీంద్ర. అతని మనసు నిశ్చలంగా ఉంది. తండ్రి వ్యథ చూసి తల్లడిల్లలేదు. అతని మాటలు రవీంద్రకు ఆశ్చర్యం కలిగించ లేదు. ఏ తండ్రైనా అలాగే అంటాడు. పైగా రైల్వేలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని చేసి రిటైరైన తండ్రి తన అంతస్తును నిలిపే కొడుకును చూసి మరింత గర్వపడతాడు. తన తండ్రీ అలాగే కోరుకుంటున్నాడు.“మన వంశంలో మొట్టమొదటి గవర్నమెంటు ఉద్యోగం చేసిన వ్యక్తిని నేను. ఈరోజు నేను ఊరు వెళ్తే అందరూ ఎంతో గౌరవం ఇస్తారు. నీ కొడుకు డాక్టరెప్పుడౌతాడని అందరూ అడుగుతుంటే హృదయం ఎంతో ఉప్పొంగేది. కానీ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నా తల దించుకునేలా చేసింది”

తండ్రి మాటలకు ఏమీ బదులివ్వలేదు రవీంద్ర. అతని మనసునిండా ఏవో అయోమయపు తెరలు కమ్ముకున్నాయి. తను తీసుకున్న నిర్ణయం మంచికో చెడుకో తెలియదు. చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తులు, తిరిగిన ప్రాంతాలు అతనిలో విశాల దృక్పథాన్ని పెంపొందించాయి. నూతన దృష్టిని కలిగించి వెళ్లవలసిన మార్గాన్ని బోధించాయి. అందుకే తండ్రికి కటువుగా అనిపించినా రవీంద్ర తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోతున్నాడు. పైకి లేచి తన గదిలోకి వెళ్తున్న కొడుకును చూస్తూ, “నీ నిర్ణయం మారదా?” మళ్ళీ అడిగాడు బాపూరావు.

తండ్రివైపు చూస్తూ, “ఈ దేశపు పేద, దళిత కోటి ప్రజల హృదయాల నుండి స్రవించిన రక్తంతో పెంచబడి, విద్యాబుద్ధులు గడించి, వారి గురించి తలవనైనా తలవని ప్రతి వ్యక్తీ దేశద్రోహియే” అనే వాక్యాన్ని పైకి చదివి వినిపించాడు. బాపూరావుకి విషయం అర్థమైంది. కొడుకు తన నిర్ణయాన్ని మార్చుకోడని, తను వెళ్లాల్సిన దారిలో వెళ్ళే క్రమంలో ఎలాంటి ప్రతికూలత నైనా ఎదుర్కోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడనే విషయం బోధపడింది. వెళ్తున్న కొడుక్కి వినబడే లాగా “డబ్బు సంచులు మోయాల్సిన చోటు వదిలి పేడతట్టలు పోగేసుకోవాలనుకునే వెర్రిబాగులోణ్ని నిన్నే చూస్తున్నా! ఎన్నాళ్ళుంటాయో ఈ ఆదర్శాలూ ఆవకాయలూ.. అదీ చూస్తాను” అన్నాడు.

***

మౌనంగా గదిలో కూర్చున్నాడు రవీంద్ర. ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. దేశం డెబ్భై ఏళ్లనుంచీ స్వేచ్ఛా గాలిని పీల్చుతూనే ఉంది. సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదలు మరింత పేదలుగా మారుతూనే ఉన్నారు. ప్రాథమిక అవసరాలు తీరక, ప్రజలు దారుణంగా చచ్చిపోతూనే ఉన్నారు. అత్యున్నత డిగ్రీలు పొందిన వాళ్లంతా తమ జ్ఞానాన్ని, యవ్వనాన్ని, శ్రమను ఇతరదేశాల అభివృద్ధికి ధారపోస్తూనే ఉన్నారు. విలువైన ఇంజనీరింగ్ డిగ్రీలు, డాక్టర్ డిగ్రీలు పొరుగుదేశాల అత్యున్నత ప్యాకేజీ కోసం పరుగులు పెడుతూనే ఉన్నాయి. ‘అన్నపూర్ణ’ సంపదంతా ‘డ్రైన్ థియరీ’ మాదిరిగా తరలిపోయి, పొరుగుదేశాల్ని ఉచ్ఛస్థితిలో నిలబెడుతూనే ఉంది. పైకి లేచాడు రవీంద్ర. వాదనలు కొన్నిసార్లు అర్థరహితంగానూ, మరికొన్నిసార్లు అసహనంతోనూ ముగుస్తాయి. తన మాటే నెగ్గాలనే పంతం తప్ప పదిమందికీ ఉపయోగపడాలనే తపన వాదనలో కనిపించదు. ఏ అడుగూ పడనంతసేపూ ఏదో అయోమయం వెంటాడుతూనే ఉంటుంది. ఒక అడుగు మొదలయ్యాకే ఎత్తుపల్లాలు తెలుస్తాయి. ఎటువైపు నడవాలో బోధపడుతుంది. తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అమలుపర్చాలో అవగాహనలోకి వస్తుంది.

అల్మరాలో ఉన్న బ్యాగ్ తీసుకుని అందులో రెండుజతల బట్టల సర్దుకున్నాడు. సర్టిఫికెట్లు పెట్టుకున్నాడు. కాసేపు ఆగి ఆలోచించాడు. తను వెళ్లదలచుకున్న దారి తెలుసు. కానీ, ఆ దారిలో ఎన్ని ముళ్లూ రాళ్లూ ఉంటాయో తెలియదు. చెప్పేవాళ్లు లేరు. ఎందుకంటే తనకంటే ముందు ఆ దారివెంట నడిచిన వాళ్లు లేరు. ఒక్కక్షణం రవీంద్రకు తల్లి గుర్తొచ్చింది. కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. రేపటినుంచీ కొడుకు దూరమైన దుఃఖాన్ని ఎలా భరిస్తుందో? కొడుకులోనే సర్వస్వాన్నీ చూసుకున్న తల్లి తన ఎడబాటును ఎలా తట్టుకుంటుందో? అయినా ఉన్నతమైన లక్ష్యాల ముందు ఉప్పెనలా ఎగసిపడే అనుబంధాల సుడిగుండాలు చిన్నగా కనిపిస్తాయి. లేచి బయటికి నడిచి వచ్చాడు.

*****

బస్సు దిగి మట్టిరోడ్డు మీద నడవసాగాడు రవీంద్ర. అది మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన మేల్ఘాట్ లోని బైరాఘర్ గ్రామం. ఎప్పుడో నాగపూర్’లో ఎంబీబీఎస్ చదివేటప్పుడు కోర్సులో భాగంగా ఏడాదిన్నరపాటు అక్కడ ప్రాక్టీస్ చేశాడు. అక్కడి వాతావరణం, మనుషుల అమాయకత్వం, ఆరోగ్యం మీద అవగాహన లేమి, అరకొర సదుపాయాలతోనే జీవిస్తున్న అమాయక గిరిపుత్రుల జీవనశైలి రవీంద్రను వారి గురించి ఎక్కువగా ఆలోచించేటట్టు చేశాయి. వాళ్లకోసం డాక్టరు కోర్సు పూర్తయ్యాక అక్కడే క్లినిక్ తెరవాలనే ఆలోచనను అతని మనసులో ప్రోదిచేశాయి. అందుకే తల్లిదండ్రులకు వేదన కలిగించే నిర్ణయం తీసుకున్నాడు.

దారంతా ఎగుడుదిగుడుగా ఉంది. భయంకరమైన గోతులతో రోడ్లన్నీ నరకానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయి. అంతరిక్షంలోకి రాకెట్లు పంపి దేశాభివృద్ధిని, దేశభక్తినీ అంచనావేస్తున్న నేటితరాలకు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో మారుమూల విసిరేసినట్లున్న ఇలాంటి పల్లెల్లోని చీకట్లు కనిపించవు. ఎదగాలని ఆశపడే వాడి దృష్టికి ఆకాశహర్మ్యాలున్న దేశాలు తప్ప ఆకలిదప్పులతో అల్లాడే దేశాలు కనిపించవు. అనారోగ్యాలతో కాటికి చేరేవాళ్ళ కన్నీటి వ్యథలు వినిపించవు.

బైరాఘర్ గ్రామంలో క్లినిక్ తెరిచాడు రవీంద్ర. చావుకీ బతుక్కీ మధ్య ఊగిసలాటగా ఉన్న గిరిజన ఊళ్లకు అదొక అద్భుతంగా తోచింది. మేల్ఘాట్ చుట్టుప్రక్కలున్న దాదాపు మూడువందల గ్రామాలకు అదొక్కటే ఆసుపత్రిగా మారిపోయింది. స్వచ్ఛందసంస్థలు అక్కడ పనిచేస్తున్నా అవన్నీ కేవలం వాళ్లకు అవసరమయ్యే వస్తువులను ఉచితంగా అందించడమే తప్ప వారి ఆరోగ్య అవసరాలపై దృష్టి సారించలేదు. అందుకే మొదట్లో తమ మీదా, తమకొచ్చే రోగాల మీదా శ్రద్ధ చూపిస్తున్న రవీంద్రను చూసి అక్కడున్న గిరిజనులంతా భయపడిపోయారు. వాళ్లతో ప్రేమగా, ఓపికగా మాట్లాడుతూ వాళ్ల సమస్యను తెలుసుకుని వైద్యం చేస్తున్న రవీంద్ర కాలక్రమంలో వారికి ఆరాధ్యుడిగా, మంచి అతిథిగా, వాళ్లల్లో ఒకడిగా మారిపోయాడు. అప్పటివరకూ ఏ ఆకునో అలమునో తమ రోగాలకు మందులుగా వాడుకున్న వారికి మొదటిసారి రవీంద్ర రాకతో రోగాలను గుర్తించి వాటి తీవ్రతను తగ్గించే మందుబిళ్లల వాడకం అలవాటయింది.

దేశానికి మారుమూలగా విరేసినట్లున్న పల్లెలో ‘క్లినిక్’ తెరిచిన రవీంద్రకు ఎన్నో కొత్తకొత్త సవాళ్ళు ఎదురయ్యాయి. వచ్చిన వాళ్లకు ఉచితంగానో, ఒక రూపాయో, రెండు రూపాయలో తీసుకుని వైద్యమైతే చేస్తున్నాడు. కానీ, వాళ్లకు అవసరమయ్యే స్కానింగులు, ఎక్స్’రేల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. రోగనిర్థారణ కోసం స్కానింగులు, ఎక్స్’రేలు రాస్తే వాటిని తీసుకురావడానికి అరవై కిలోమీటర్ల దూరం వెళ్తున్న మనుషుల్ని చూసి ఎంతో క్షోభకు గురయ్యాడు రవీంద్ర. ఈలోగా పట్టుదలగా ఎం. డీ కోర్సు పూర్తిచేశాడు. ఆ సమయంలో రవీంద్ర ప్రొఫెసర్లలో ఒకరైన డాక్టర్ జాజు అతని సేవాదృక్పథాన్ని, పట్టుదలను కొనియాడుతూనే, “రవీంద్రా! మారుమూల ప్రాంతంలో వైద్యం చేయాలనే ఆలోచన ఉన్న ఏ వైద్యుడైనా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. రక్తమార్పిడి సౌకర్యం లేకుండా కాన్పు చేయడం నేర్చుకోవాలి. ఎక్స్’రే అవసరం లేకుండా న్యుమోనియాను నిర్ధారించాలి. విరేచనాలను నయం చేయడం తెలిసివుండాలి. అప్పుడే వైద్యంద్వారా వాళ్లకు న్యాయం చేయగలుగుతావు” అని చెప్పడం రవీంద్రలో నూతన ఆలోచనలను రేకెత్తించింది.

కొండకోనల్లో ఉన్న గిరిజనులకు వైద్యం చేయాలనే ఆలోచన రవీంద్రను వైద్యంలో కొత్త కొత్త అంశాలను నేర్చుకునేలా చేసింది. డాక్టర్ జాజు దగ్గరే ఉంటూ ఆరునెలల పాటు వాటిని నేర్చుకున్నాడు. అదే సమయంలో డా. స్మిత అతనికి పరిచయమయింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అయినా రవీంద్ర మాత్రం వ్యక్తిగత సుఖం కంటే తానెంచుకున్న మార్గమే ముఖ్యమని భావించాడు. అదే విషయాన్ని స్మితతో చెప్పాడు. అతని వంక ఆశ్చర్యంగానూ, అయోమయంగానూ చూసింది స్మిత. చిన్న క్లినిక్ తెరిచి చాలామంది లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్న రోజుల్లో వైద్యాన్ని ‘ఉచితం’గా అందిస్తానని చెప్తున్న రవీంద్ర ఆలోచన ఆమెలో అంతః కల్లోలాన్ని సృష్టించింది. ‘అయినా ఇష్టపడడమూ, ప్రేమించడమూ అంటే కేవలం... తినేవీ, కొనేవీ పంచుకోవడమూ, వాటి గురించి మాత్రమే తెలుసుకోవడమూ కాదుగా! అడుగుల్లో అడుగులుగా, ఆలోచనల్లో ఆలోచనగా వెన్నంటి ఉండడం కూడా ప్రేమలో భాగమేగా!’ అనుకుని సమాధానపడి తన ఇష్టాన్ని కూడా తెలియజేసింది. అందుకే భవిష్యత్తులో లక్షలు సంపాదించే అవకాశమున్న ఉద్యోగాన్ని వదిలి కేవలం నాలుగువందలు సంపాదించే రవీంద్ర వెంట నడవడానికి ఆమె సిద్ధపడింది.

 ******

కాలం కాళ్లకింద ముళ్లను పరుస్తూ ముందుకు సాగింది. ఎన్నో ప్రతికూలతలు, ఎన్నెన్నో అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతున్న వాళ్లకి ఆ రాత్రి కాళరాత్రి అయింది. భోరున వర్షం మొదలైంది. నెలలు నిండిన స్మితకు మనసంతా ఆందోళనగా ఉంది. ప్రసవం ఇప్పుడో అప్పుడో అన్నట్లుగా ఉంది. పైకి గంభీరంగా ఉన్నా ఆమెలో ఒత్తిడి మొదలయింది. హఠాత్తుగా నొప్పులు ప్రారంభమయ్యాయి. అల్లాడుతూ మెలికలు తిరుగుతున్న స్మితను చూస్తూ గబగబా వైద్యానికి పూనుకున్నాడు రవీంద్ర. ఆమె అరుపులకు అంత వానలోనూ తాటాకు గొడుగుల్ని వేసుకుని ఆడవాళ్ళు వచ్చారు. అప్పుడుప్పుడూ వచ్చే ఉరుములు ఆమె అరుపులకు వంత పాడుతున్నట్లుగా ఉన్నాయి.

ఆమె పరిస్థితిని చూస్తూ కొంతమంది వయసులో పెద్దవాళ్లు రవీంద్రకు దగ్గరగా వచ్చి“బాబూ.. అమ్మాయిని సూత్తంటే పేనాలు పోతన్నాయి. మా మాట ఇని ఏదైనా ఆస్పెత్రికి తీసుకెళ్లండి” అన్నారు. ఆ మాట విన్న స్మిత కళ్లల్లో ఒక్కసారిగా అంతులేని దైన్యం ఆవరించింది. అంతలోనే ఏదో తెలియని ధైర్యం ఆవహించింది. భర్త వైపు చూస్తూ, “నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వైద్యం మాత్రం ఇక్కడే చేయండి. మీరే చేయండి”. ఆగుతూ ఆగుతూ ఆయాసం తీర్చుకుంటూ అంది. ఆమె మాటలకు వచ్చిన ఆడవాళ్లంతా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఆమె ఉద్దేశ్యం అర్థమై అయోమయంగా చూశారు. ఏదైతే అదే అవుతుందని భావించి కొంతమంది ఆడవాళ్లు స్మిత చుట్టూ చేరి కాన్పు సవ్యంగా జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆమెకు సపర్యలు చేస్తున్నారు.

రవీంద్ర భార్య వంక చూశాడు. అన్ని సౌకర్యాలనూ వదులుకుని తనవెంట నడిచిన సహచరి చావు బతుకుల్లో ఉంది. తన ఇష్టాలను ఆమె ఇష్టాలుగా మలచుకుని కాపురం చేసింది. ఎలాగైనా ఆమెనూ, పుట్టబోయే బిడ్డనూ బతికించుకోవాలి అనుకున్నాడు. వైద్యం మొదలుపెట్టాడు. కొంత సమయం గడిచింది. ‘కేర్’ మన్న కేకతో అందరి మొహాల్లోనూ ఆనందం తొణికిస లాడింది. వెనక్కిలాగే పరిస్థితుల కంటే ముందుకు నడిపే సంకల్పబలానికి ఎంత శక్తి ఉంటుందో అందరికీ అర్థమైంది. ఈ సంఘటన తర్వాత అక్కడున్న గిరిజనులకు రవీంద్ర దంపతులు ఎంతో ఆత్మీయులుగా మారిపోయారు. ఎన్నో వ్యక్తిగత సుఖాలనూ, సౌకర్యాలనూ వదులుకుని గిరిజనులకు వైద్యం చేయడం ప్రారంభించారు రవీంద్ర దంపతులు. చేసే పనిలో చిత్తశుద్ధి లేకపోయినా, తమ మీద తమకు ఆత్మవిశ్వాసం లోపించినా వాళ్లిద్దరూ ఎప్పుడో వెనకడుగు వేసేవాళ్లే! కానీ సరైన వైద్యసదుపాయాలు లేని ఊళ్లమీద వాళ్లిద్దరూ అవ్యాజమైన ప్రేమను పెంచుకున్నారు. వైద్యంలో కొత్త కొత్త మెళకువలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.

******

ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల వల్ల కొత్తగా వచ్చే రోగాలను గుర్తించసాగారు. ముఖ్యంగా వ్యవసాయం బాగా జరిగి తిండిగింజలు దొరికినంత కాలం గిరిజనులు ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించారు. సరైన ఆహార పదార్థాలు దొరకని కాలంలో వాళ్లు పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు తెలుసుకుని తల్లడిల్లారు. అంతేకాకుండా న్యుమోనియా, మలేరియా లాంటి రోగాల బారిన పడి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించి, దాన్ని ఎదుర్కొనే మార్గాల కోసం తీవ్రంగా అన్వేషించారు. అప్పటివరకూ డాక్టరుగా భిన్నరోగాలను గుర్తించి దానికి వైద్యం మాత్రమే చేసిన రవీంద్రలో వ్యవసాయ కోర్సు చేయాలనే ఆలోచన మొదలయింది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఏడాది పొడవుగా ఆహార పంటలు పండించగలిగితే పోషకాహారాలోపాన్ని చాలావరకూ నివారించవచ్చనే ఆలోచన అతనిలో నూతనోత్సాహాన్ని నింపింది. అందుకే అతని అడుగులు పంజాబ్ లోని కృషీ విద్యాపీఠంలో అగ్రికల్చర్ కోర్సు చేయడానికి అతన్ని పురికొల్పాయి. రవీంద్ర తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల్లో జీవనప్రమాణాలను పెంచింది. శిశుమరణాలను తగ్గించింది. పోషకాహార లోపాలకు నివారణగా నిల్చింది. గిరిజనుల్లో వెలుగులు నింపడానికి రవీంద్ర దంపతులు చేస్తున్న కృషి ఆనోటా ఈనోటా పాకి రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. వైద్యంలోనే కాకుండా వ్యవసాయంలో కూడా నూతన పద్ధతుల్ని ప్రవేశపెడుతున్న రవీంద్రను ‘లోకమత్ మహరాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించి పదిహేను లక్షల రూపాయలను అందించింది. వాటిని కూడా బైరాఘడ్ ప్రాంతంలో ‘ఆపరేషన్ థియేటర్’ కోసం, కంటి సమస్యలు అధికంగా ఉండడంతో ‘కంటి ఆసుపత్రి’ నిర్మాణం కోసం వెచ్చించాడు.

*****

ఆ రాత్రి రవీంద్ర కుటుంబంతో ఆరుబయట వెన్నెల్లో కూర్చున్నాడు. ఇన్నేళ్ల నుంచీ వైద్యంలో తనకు వెన్నుదన్నుగా నిచిన భార్య వైపు, వైద్యం, అగ్రికల్చర్ డిగ్రీలు పొంది చేతికందిన కొడుకుల వైపు సంతృప్తిగా చూశాడు రవీంద్ర. నెరిసిన వెంట్రుకల్లో నుంచి అతని పెదవులపై చిర్నవ్వు మెరిసింది. కొడుకుల వైపు చూస్తూ, “ఆసుపత్రంటే దేవాలయం! డాక్టర్లంటే తిరిగి బతికించే దేవుళ్ళు! కొన్ని రోగాల్ని మందుబిళ్లలు నయం చేస్తాయి. కొన్ని రోగాల్ని మంచి మాటలు నయం చేస్తాయి. మన అసహనాన్నీ, కోపాన్ని రోగుల మీద చూపించకూడదు. ప్రేమగా మాట్లాడి వాళ్ల రోగాల్ని బాగుచేయాలి. ఏ పని చేసినా లాభం సంపాదించాలనే ధ్యాస తప్ప మరొక ఆలోచన లేని ఉరుకుపరుగుల లోకంలో మనమున్నాం. వైద్యం ద్వారా సేవ చేయండి. వీలైతే ఉచితంగా, తప్పనప్పుడు తక్కువఖర్చుతో రోగులకు వైద్యం చేయండి. వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడి సంపాదించిన ఆస్తి మనకు మనశ్శాంతిని ఇవ్వదు. స్ట్రెచర్ మీద ఉన్నవాడిని స్టేటస్ తో పనిలేకుండా కాపాడడమే మన ప్రథమ కర్తవ్యం. వైద్యమంటే సేవ! వైద్యమంటే మానవత్వం! వైద్యమంటే సాయం! మనం చేసే వైద్యంలో ఇవేమీ లేకపోతే మనం వైద్యులుగా బతికుంటాం... వ్యక్తులుగా చచ్చిపోతాం” అన్నాడు. కొడుకులిద్దరూ చిర్నవ్వు నవ్వారు. స్మిత భర్తవైపు అనునయంగా చూసింది. పెద్ద కొడుకు మంచం మీద నుంచి లేచి ఇంట్లోకి వెళ్లి చేతిలో ఒక పుస్తకంతో తిరిగొచ్చాడు. తండ్రివైపు చూస్తూ, “ఈ దేశపు పేద, దళిత కోటి ప్రజల హృదయాలనుండి స్రవించిన రక్తంతో పెంచబడి, విద్యాబుద్ధులు గడించి వారి గురించి తలవనైనా తలవని ప్రతి వ్యక్తీ  దేశద్రోహియే” అనే వాక్యాన్ని పైకి చదివి వినిపించాడు.

*****

Kommentare hinzufügen