ఒక్క క్షణం
ఒక్క క్షణం (Author: పతి మురళీధర శర్మ)
ప్రారంభమైంది. ఇంతకీ కథ ఏమిటంటే మామూలే. ఓ అమ్మాయి మానభంగానికి గురవుతుంది. ఆపై ఏసిడ్ దాడికి గురవుతుంది. కన్న తలిదండ్రులు కూతుర్ని వదులుకోలేరు కాబట్టి చికిత్స చేయించారు. కాని పూర్వపు రూపం తేలేకపోయారు. పరువుప్రతిష్ఠలు పోతాయని భయపడి ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. కూతురిజీవితం ఇలా అయిపోయిందేమిటా అని ఒకటే దిగులు. కూతురు ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందోనని ఒకటే భయం వాళ్లకు. కాని ఆ అమ్మాయి తన బ్రతుకు నాశనం చేసిన దోషికి శిక్ష పడేవరకూ పోరాడింది. ఇదీ కథ. “అదే ఆ అమ్మాయి అందరూ తనను అసహ్యించుకుంటున్నారని ఆత్మహత్య చేసుకుని ఉంటే అక్కడితో కథ ముగిసిపోయి ఉండేది. కాని ఆ అమ్మాయి ఆత్మస్థైర్యంతో అలా పోరాడబట్టే కదా నేరస్థుడికి శిక్ష వేయించగలిగింది. చనిపోయి ఉంటే ఏం ?” ఆనందరావు అంతరంగం పదేపదే హెచ్చరిస్తుంది. ఆనందరావు నిర్ణయానికి అన్నీ అవరోధాలే.
ధియేటర్ నుండి బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా తన అభీష్టానికి వ్యతిరేక సూచనలే. అలా నడుచుకుంటూ వస్తున్నాడు. రోడ్డు ప్రక్కన చెట్లూచేమలలో గుడిసెలు కనబడుతున్నాయి. అందులోని వాళ్లకు ఎండయినా, వానయినా, చలి అయినా అదే రక్షణ. క్రిమికీటకాల మధ్య విషపు పురుగుల మధ్య జీవిస్తున్నారు. ఆ బ్రతుకెంత దయనీయం! అయినా వాళ్ళూ మనుగడ సాగిస్తున్నారు. వాళ్ళ మొహాల్లో ఎక్కడా ఏ బాధా, విచారమూ కనబడలేదు.
“ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఈవేళ నా కార్యక్రమానికి అంతరాయం కలిగించేలా ఉన్నాయి ఈ దృశ్యాలు అన్నీ. అయినా నేను వెనుదిరిగేదిలేదు.” అనుకుంటూ రైల్వేస్టేషన్ వైపు నడిచేడు.
ఆ రైల్వేస్టేషన్ తో ఆనందరావుకు ఎంతో అనుబంధం. ఎందుకంటే ఉద్యోగరీత్యా ప్రక్క ఊరికి రోజూ వెళ్ళేది ట్రైన్ లోనే. అంచేత వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ రైలు ప్రయాణం ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది. ఒకసారి ఎవరో పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని రైలు సడన్ గా మధ్యలో ఆగిపోయింది. ఆ రోజు ప్రయాణీకులందరూ పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. అప్పుడు తనే అన్నాడు ఆత్మహత్యలంటే ఆటల్లా ఉన్నాయని. మరి ఇప్పుడు తను చేస్తున్న పనేంటి? తను అలా చేయకూడదు. ట్రైన్ ఎక్కి ఎవరూ చూడకుండా రైలు బ్రిడ్జి మీద నుండి వెళ్ళేటప్పుడు క్రిందకు దూకేస్తే సరి. ఎవరికీ ఇబ్బంది ఉండదు అనుకుని ఓ కంపార్ట్ మెంట్ ఎక్కేశాడు. ట్రైన్ ఇంకా కదలలేదు. నాకింకా టైం ఉంది అనుకున్నాడు ఆనందరావు. అంతవరకూ కాలక్షేపంగా కంపార్ట్ మెంట్ అంతా కలియదిరిగేడు.
ఒక దగ్గర ఒకాయన పేపరు చదువుతున్నాడు. “ప్రేమ విఫలమై ప్రేమికుల ఆత్మహత్య” చూడండి. ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆషామాషీ అయిపొయింది. తల్లి మందలించిందని ఓ కూతురూ, తండ్రి కోప్పడ్డాడని ఓ కొడుకూ, టీచర్ తిట్టిందని అవమానం భరించలేక ఓ స్టూడెంటూ, పరీక్ష బాగా వ్రాయలేదు ఫెయిలవుతానేమోననే బెంగతో ఓ విద్యార్థీ, భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి ఓ భార్యా, వృద్ధాప్యంలో జీవితంమీద విరక్తి చెంది వృద్ధులూ, వర్షాలు లేక పంట పండలేదనీ, పండినపంట తుఫానులూ, వరదలవల్ల దక్కలేదనీ, చేసిన అప్పులు తీర్చలేమని రైతులూ ఇలా ఎవరికివారు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. వీళ్ళంతా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే తలిదండ్రులకు పుత్రశోకమూ, భార్యాభర్తలకు జంట వియోగమూ, సంతానానికి వృద్ద తలిదండ్రుల వియోగమూ తప్పించి ఉండేవారు” ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఇంకా అక్కడ ఉంటే తన మనసూ మారుతుందని డోర్ దగ్గరకు వచ్చేశాడు ఆనందరావు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది.
రైలు ఊగిసలాగే ఆనందరావు మనసు ఊగిసలాడుతుంది. దూకేద్దాం అనుకున్న ప్రతీసారీ ఎవరో ఒకరు డోర్ దగ్గరకు వస్తుండడంతో ఆగిపోతున్నాడు. సమయంకోసం చూస్తున్నాడు. రైలు బ్రిడ్జి మీదకు రానే వచ్చింది. ఆనందరావు దూకేయబోతుండగా వెనకనుండి ఎవరో తట్టినట్లయింది. చూస్తే ఓ అమ్మాయి.
“ఏంటమ్మా?” అన్నాడు ఆనందరావు. నాకు వినబడదన్నట్లు చెవి వైపు చూపించి సైగ చేసింది. “పోనీ చెప్పమ్మా“ అన్నట్టు సైగ చేశాడు ఆనందరావు. నాకు మాటలు కూడా రావన్నట్లు మూగభాషలో చెప్పింది. “మరెలా?“ అన్నాడు ఆనందరావు. వెంటనే ఆ అమ్మాయి ఓ కాగితం చూపించింది. అది చదివి ఆనందరావుకు నోటమాట రాలేదు. అందులో ఏమి వ్రాసి ఉందంటే –
“అంకుల్! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు ట్రైన్ ఎక్కినప్పటి నుండీ చూస్తున్నాను మీలో ఏదో కంగారు, అలజడీ. ఒక దగ్గర కూచోకుండా డోర్ దగ్గర నిలబడి దూకేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. నేనో అనాథను. అనాథాశ్రమంలో ఉంటున్నాను. మీరెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలియదు. కాని నాలాగే మీకూ ఎవరూ లేకపోతే నన్ను మీ కూతురిగా స్వీకరించి ఆత్మహత్యాయత్నం మానుకోండి“.
ఆనందరావు కళ్ళవెంట ఒకటే నీళ్ళు. ఆ అమ్మాయిని ఒక్కసారిగా కన్నకూతురిలా హత్తుకున్నాడు. ఉదయం నుండీ తాను చూసిన దృశ్యాలు ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి. “గుడి దగ్గర ముష్టివాళ్ళూ, రెస్టారెంట్ దగ్గర ముసలివాడూ, రోడ్డుప్రక్కన గుడిసెలలోనివాళ్ళూ. ఇప్పుడీ మూగ, చెవిటి అమ్మాయీ. వీళ్ళెవరూ ఆత్మహత్యలు చేసుకోవడంలేదు. వాళ్ళందరికీ లేని లోటు నాకేముంది? క్షణికావేశంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తెలిసింది. ఈ అమ్మాయి నా మనసు మార్చింది”. అనుకుంటుండగానే ఆ అమ్మాయికోసం ఓ పెద్దమనిషి అక్కడకు వచ్చాడు.
ఆ సన్నివేశాన్ని చూసి ఆనందరావుని అడిగి జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. తను ఆ అనాథాశ్రమ నిర్వాహకుడినని చెప్పేడు. ఆ అమ్మాయిని మౌనిక అంటామనీ, ఆ అమ్మాయిని పెంచుకోదలచుకుంటే పెంచుకోవచ్చుననీ చెప్పాడు. ఇంకేం ఆనందరావు ఆ అమ్మాయిని తన స్వంత కూతురిలా చూసుకుంటానని ఆ పెద్దాయనకు హామీ ఇచ్చి తనతో తన ఇంటికి తీసుకువెళ్తానని అనుమతి కోరాడు. ఆ పెద్దాయన సంతోషం వెలిబుచ్చుతూ అంగీకరించాడు. ప్రక్క స్టేషన్ లో ఆనందరావూ, ఆ అమ్మాయీ దిగిపోతూ ఆ పెద్దాయన దగ్గర సెలవు తీసుకున్నారు.
ఆ స్టేషన్ లో రిటర్న్ ట్రైయినెక్కి ఇద్దరూ మళ్ళీ వాళ్ళ ఊరి స్టేషన్ లో దిగారు. స్టేషన్ లో అనౌన్స్మెంట్ వినబడుతుంది.
“బి. ఆనందరావు ఎక్కడున్నా ఎంక్వయిరీ ఆఫీసుకి రావలసింది.“ అని. ఆశ్చర్యపోయేడు ఆనందరావు. గబగబా ఎంక్వయిరీ ఆఫీసు కి వెళ్లి చూస్తే అక్కడ తన భార్య అనూరాధ ఉంది.
“ఏంటండీ! ఉదయం నుండీ మీరు కనబడలేదు. సెల్ ఇంట్లో వదిలేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? భోజనానికి కూడా రాలేదు. మేమెంత గాబరా పడ్డామో తెలుసా? ఇంతవరకూ రాకపోయేసరికి అందర్నీ ఎంక్వయిరీ చేస్తే ఎవరో మిమ్మల్ని రైల్వేస్టేషన్ లో చూసినట్లు చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ చేయించాను“ ఒకటే చెప్పుకుంటూ పోతోంది.
“చెప్తానుండవోయ్! ఆదివారం కదా అలా బయటకు వచ్చాను.”
“బయటకు వెళ్తున్నట్టు ఇంట్లో ఎవరికైనా చెప్పొచ్చుకదా!” దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ఆనందరావుకి. “సెల్ ఇంట్లో మర్చిపోయాను. శివాలయానికి వెళ్ళాను. తిరిగి వచ్చేస్తుంటే దారిలో నా చిరకాల స్నేహితుడొకడు కనబడ్డాడు. వాళ్ళింటికి రమ్మంటే వెళ్ళాను. భోజనం చెయ్యమని బలవంతం చేస్తే వాళ్ళింట్లో భోజనం చేసేశాను.” అతికినట్లు అబద్ధం చెప్పాడు.
“మరి ఆ సంగతి మాకెలా తెలుస్తుంది? మీ ఫ్రెండ్ ఫోన్ నుంచి చేసి చెప్పొచ్చు కదా! మీరు చెప్పేవాటికి పొంతన లేకుండా ఉంది. మీ వ్యవహారం మాత్రం నాకు ఏదో అనుమానంగా ఉంది.” అంది అనూరాధ. దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆనందరావుకి.
“ఈ అమ్మాయి ఎవరు?” అడిగింది.
“అదేనోయ్! మనకి పిల్లల్లేరు కదా! అందుకే తీసుకొచ్చాను అనాథాశ్రమం నుంచి పెంచుకుందామని. పేరు మౌనిక.“ అని చెప్పాడు అసలు సంగతి బయటపెట్టకుండా. భార్య ముఖంలో రంగులు మారాయి. “పెంచుకునేది మనం. నన్ను సంప్రదించాలని అనిపించలేదా?” నిలదీసింది అనూరాధ.
“నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతోనే ఆ అమ్మాయిని చూడగానే అలా చేయాలనిపించింది.” సంజాయిషీ చెప్పేడు ఆనందరావు భర్తగా. అనూరాధ ఆ అమ్మాయిని తదేకంగా చూస్తోంది. ఇంక లాభం లేదని ఈ అమ్మాయి మూగ, చెవిటిది అని చెప్పెశాడు.
“ఏం మరెవరూ దొరకలేదా?” వెటకారంగా అంది ఆ అమ్మాయి చెవిటిది, వినలేదనే ధీమాతో. కాని తన భార్య ముఖంలో భావాలు తెలిసిపోతుండొచ్చు అనుకున్నాడు ఆనందరావు.
“అన్నీ ఉండి లక్షణంగా ఉన్న పిల్లల్నెవ్వరైనా పెంచుకుంటారు. ఇలాంటి వాళ్ళను పెంచుకోవడమే గొప్ప, మానవత్వమూను” చెప్పాడు. దానితో అనూరాధ ఏం మాట్లాడలేకపోయింది. అదే అదనుగా, “పద. ఇంటికెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం. ఇక్కడ వాదించుకుంటే బాగోదు. అందరూ వింటారు”. అని సర్ది చెప్పి ఇద్దర్నీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఆనందరావు. శివాలయంలో తీర్థం మహిమ తెలిసొచ్చింది. తనకు అకాల మృత్యుహరణం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బాగుండేది అనుకున్నాడు ఆనందరావు.
( ఈ కథ ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళకు అంకితం )